రాహుల్​పై అనర్హతకు నిరసనగా నేడు కాంగ్రెస్​ దీక్ష

రాహుల్​పై అనర్హతకు నిరసనగా నేడు కాంగ్రెస్​ దీక్ష
  • గాంధీభవన్​లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు
  • కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది: రేవంత్​
  • ఇంట్లో కూర్చుంటే కుదరదు..  అందరూ బయటకొచ్చి పోరాడాలి: ఠాక్రే
  • మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లతో సమావేశం

హైదరాబాద్​, వెలుగు: రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ ఆదివారం నిరసన దీక్ష చేపట్టనుంది. హైదరాబాద్​ గాంధీభవన్​లోని గాంధీవిగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా దీక్ష చేయనున్నారు. కాగా, రాహుల్​ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రేవంత్​రెడ్డి ఆరోపించారు. భారత్​ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు రాహుల్​కు మద్దతు తెలపడం, అదానీ అంశంపై నిలదీస్తుండడంతో మోడీ ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నదని విమర్శించారు. శనివారం గాంధీభవన్​లో కాంగ్రెస్​ పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్​కార్పొరేటర్లతో మాణిక్​రావు ఠాక్రే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్​ పాల్గొని మాట్లాడారు. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్​ గట్టిగా పోరాడుతున్నదని, అందుకే కేంద్ర ప్రభుత్వం టార్గెట్​ చేసుకున్నదని మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్​లో నిర్వహించే దీక్షలో ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు. 

కలిసికట్టుగా పోరాడాలి: ఠాక్రే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్​ శ్రేణులు కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని మాణిక్​ రావు ఠాక్రే అన్నారు. ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేమీ ఉండదని, అందరూ బయటకొచ్చి పోరాడాలని ఆయన సూచించారు. ప్రత్యక్ష పోరాటాలతో పాటు సోషల్​ మీడియాలోనూ కాంగ్రెస్​ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాహుల్​గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీకి బీఆర్​ఎస్​ మద్దతునిస్తున్నదని 
ఆరోపించారు. 

అణచివేత రాజకీయాలపై పోరాడండి

రాష్ట్ర కాంగ్రెస్​ ముఖ్య నేతలకు ఏఐసీసీ చీఫ్​ ఖర్గే సూచన


హైదరాబాద్​, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు న ఖర్గే శనివారం హైదరాబాద్​కు వచ్చారు. కర్ణాటకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఢిల్లీకి తిరు గు ప్రయాణంలో భాగంగా కర్ణాటక పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​తో కలిసి హైదరాబాద్​లో దిగారు. ఈ సందర్భంగా ఖర్గే, శివకుమార్​ను శంషాబాద్​ ఎయిర్​పోర్టులో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​, ఎంపీ ఉత్తమ్​, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ గౌడ్​, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్​ అలీ తదితరులు రిసీవ్​ చేసుకున్నారు. ఎయిర్​పోర్టులోనే వారితో ఖర్గే భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. రాహుల్​ గాంధీపై అనర్హత తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు హాత్​ సే హాత్​ జోడో యాత్ర సాగుతున్న తీరు గురించి ఖర్గే ఆరా తీశారు. బీజేపీ అణచివేత రాజకీయాలకు దిగుతున్నదని, దీనిపై క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయాల్సిందిగా కాంగ్రెస్​ నేతలకు ఆయన సూచించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఖర్గేకు రేవంత్​ వివరించారు. రెండు రోజులుగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలను చెప్పారు. ఇప్పటిదాకా 31 నియోజకవర్గాల్లో హాత్​ సే హాత్​ జోడో యాత్ర చేశానని, ప్రజల నుంచి స్పందన బాగుందని రేవంత్​ తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్​ జావెద్​, రోహిత్​ చౌదరీ, సంపత్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.