- ఏడు మున్సిపాలిటీల్లో హస్తం హవా
- కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో హంగ్
- కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 సీట్లు
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. ఏడు మున్సిపాలిటీలను కాంగ్రెస్కైవసం చేసుకుంది. జిల్లాలో రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామపంచాయతీ ఎన్నికల తరహాలోనే తాజా మున్సిపల్ ఎలక్షన్లలోనూ ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 117 వార్డులకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ 83 వార్డులను గెల్చుకుంది. బీఆర్ఎస్ 21 వార్డులతో సరిపెట్టుకుంది. సీపీఎం 3 వార్డులు, సీపీఐ 4 వార్డులు గెలిచాయి. ఇండిపెండెంట్లు ఆరు వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ సున్నాకు పరిమితమైంది.
వైరా, కల్లూరు, సత్తుపల్లిలో అధికార పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. చివరకు అన్ని మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అత్యధికంగా కల్లూరులో 7, సత్తుపల్లిలో 6, వైరాలో 5 వార్డులను మాత్రమే గెల్చుకోగలిగింది. ఇక జిల్లాలో బీఆర్ఎస్ తో జతకట్టిన సీపీఎం ఏదులాపురంలో కేవలం 2 వార్డులను గెల్చుకుంది. అది కూడా 20వ వార్డులో సీపీఎంకు మద్దతుగా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకపోవడం కలిసివచ్చింది. మరోవైపు ఏదులాపురంలో కాంగ్రెస్ ను విభేదించి సింగిల్ గా బరిలోకి దిగిన సీపీఐ కూడా దెబ్బతిన్నది. మూడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అన్ని మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ ను మించి వార్డులను కాంగ్రెస్ గెల్చుకోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలను గెల్చుకోవడం ఖాయమైంది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. కార్పొరేషన్లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 సీట్లు వచ్చాయి. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్విజయభేరి మోగించింది. బీఆర్ఎస్ పరువు నిలుపుకుంది. కార్పొరేషన్ తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో బీజేపీ పాగా వేసింది. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఇల్లెందులో 24 వార్డులకు 19, అశ్వారావుపేటలో 22 వార్డులకు 17 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగిరింది.
