
- ఈ ఏడాది నుంచే కొత్త బిల్డింగ్లో క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు
- 80 శాతం పనులు కంప్లీట్, మిగిలిన పనులు జులై ఆఖరులోగా పూర్తి చేయడంపై అధికారుల నజర్
వనపర్తి, వెలుగు: వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ ఏడాది నుంచే కొత్త బిల్డింగ్లో క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 20 శాతం పనులను స్పీడప్ చేశారు. ఇటీవల మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించి, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభించే నాటికి బిల్డింగ్ పనులు పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.
25 ఎకరాల్లో కాలేజీ నిర్మాణం..
కొత్తగా కట్టిన కలెక్టరేట్ వెనుక ఉన్న ప్రభుత్వ భూమిలో పాతిక ఎకరాలతో పాటు కొంత స్థలాన్ని సేకరించి మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాన్ని గిరిజనులు సాగు చేసుకుంటుండడంతో భూ సేకరణ కొంత ఆలస్యమైంది. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. మొదట నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ నిర్మించారు. ఆ తరువాత 2022లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరాన్ని ప్రారంభించారు. 3.28లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలేజీ భవనం నిర్మాణమవుతోంది. ఈ బిల్డింగ్ పూర్తి కాగానే ఇప్పుడు ఉన్న బిల్డింగ్లో నర్సింగ్ కాలేజీని కొనసాగించనున్నారు.
అన్ని హంగులతో..
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ బిల్డింగ్లో అన్ని సౌలతులు కల్పిస్తున్నారు. ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ బిల్డింగ్, ఐదు, ఆరు అంతస్తుల్లో బాయ్స్, గర్ల్స్హాస్టల్ నిర్మిస్తున్నారు. కాలేజీ బిల్డింగ్ను ఐదు అంతస్తుల్లో నిర్మించారు. బాయ్స్ హాస్టల్ ను జీ ప్లస్ ఫైవ్, గర్ల్స్హాస్టల్ను జీ ప్లస్ 6గా నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తి కాగా, ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్, టైల్స్ కలరింగ్ పనులు కావాల్సి ఉంది. మూడేండ్ల నుంచి ఏడాదికి 150 మంది చొప్పున అడ్మిషన్లు పొందిన 450 మెడికోలతో పాటు ఈ ఏడాది మరో 150 మంది అడ్మిషన్లు తీసుకోనున్నారు. ప్రస్తుతం నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు అద్దె బిల్డింగ్లో ఉంటుండగా, మెడికోలు ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉన్న బిల్డింగ్లో ఉంటున్నారు.
పెరగనున్న వ్యయం..
మెడికల్ కాలేజీ బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.184 కోట్లు ఖర్చు పెట్టింది. ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా, మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసేందుకు ఖర్చు పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. మెటీరియల్ ధరలు పెరగడంతో మరిన్ని నిధులు అవసరం అవుతాయని
అంటున్నారు.
జులై కల్లా పూర్తి చేస్తాం..
మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులే మిగిలాయి. వాటిని పూర్తి చేసి జులై ఆఖరు కల్లా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
దేశ్యా నాయక్, ఈఈ, ఆర్అండ్బీ