వనపర్తి జిల్లాలో పూర్తి కావస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు

వనపర్తి జిల్లాలో పూర్తి కావస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు
  • ఈ ఏడాది నుంచే కొత్త బిల్డింగ్​లో క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు
  • 80 శాతం పనులు కంప్లీట్, మిగిలిన పనులు జులై ఆఖరులోగా పూర్తి చేయడంపై అధికారుల నజర్

వనపర్తి, వెలుగు: వనపర్తి ప్రభుత్వ మెడికల్​ కాలేజీ భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ ఏడాది నుంచే కొత్త బిల్డింగ్​లో క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 20 శాతం పనులను స్పీడప్​ చేశారు. ఇటీవల మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ పనులను కలెక్టర్​ ఆదర్శ్​ సురభి పరిశీలించి, ఎంబీబీఎస్​ ఫస్ట్​ ఇయర్​ అడ్మిషన్లు ప్రారంభించే నాటికి బిల్డింగ్​ పనులు పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. 

25 ఎకరాల్లో కాలేజీ నిర్మాణం..

కొత్తగా కట్టిన కలెక్టరేట్​ వెనుక ఉన్న ప్రభుత్వ భూమిలో పాతిక ఎకరాలతో పాటు కొంత స్థలాన్ని సేకరించి మెడికల్​ కాలేజీ పనులు ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాన్ని గిరిజనులు సాగు చేసుకుంటుండడంతో భూ సేకరణ కొంత ఆలస్యమైంది. మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. మొదట నర్సింగ్​ కాలేజీ బిల్డింగ్​ నిర్మించారు. ఆ తరువాత 2022లో ఎంబీబీఎస్​ మొదటి సంవత్సరాన్ని ప్రారంభించారు. 3.28లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలేజీ భవనం నిర్మాణమవుతోంది. ఈ బిల్డింగ్​ పూర్తి కాగానే ఇప్పుడు ఉన్న బిల్డింగ్​లో నర్సింగ్​ కాలేజీని కొనసాగించనున్నారు.

అన్ని హంగులతో.. 

కొత్తగా నిర్మిస్తున్న మెడికల్​ కాలేజీ బిల్డింగ్​లో అన్ని సౌలతులు కల్పిస్తున్నారు. ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్​ బిల్డింగ్, ఐదు, ఆరు అంతస్తుల్లో బాయ్స్, గర్ల్స్​​హాస్టల్​ నిర్మిస్తున్నారు. కాలేజీ బిల్డింగ్​ను ఐదు అంతస్తుల్లో నిర్మించారు. బాయ్స్​ హాస్టల్ ను జీ ప్లస్​ ఫైవ్, గర్ల్స్​​హాస్టల్​ను జీ ప్లస్​ 6గా నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తి కాగా, ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్, టైల్స్​ కలరింగ్​ పనులు కావాల్సి ఉంది. మూడేండ్ల నుంచి ఏడాదికి 150 మంది చొప్పున అడ్మిషన్లు పొందిన 450 మెడికోలతో పాటు ఈ ఏడాది మరో 150 మంది అడ్మిషన్లు తీసుకోనున్నారు. ప్రస్తుతం నర్సింగ్​ కాలేజీ స్టూడెంట్లు అద్దె బిల్డింగ్​లో ఉంటుండగా, మెడికోలు ప్రభుత్వ ట్రైనింగ్​ సెంటర్​ వద్ద ఉన్న బిల్డింగ్​లో ఉంటున్నారు.

పెరగనున్న వ్యయం..

మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ నిర్మాణానికి ప్రభుత్వం రూ.184 కోట్లు ఖర్చు పెట్టింది. ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా, మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసేందుకు ఖర్చు పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. మెటీరియల్​ ధరలు పెరగడంతో మరిన్ని నిధులు అవసరం అవుతాయని 
అంటున్నారు.

జులై కల్లా పూర్తి చేస్తాం..

మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులే మిగిలాయి. వాటిని పూర్తి చేసి జులై ఆఖరు కల్లా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

దేశ్యా నాయక్, ఈఈ, ఆర్అండ్​బీ