
- ప్రభుత్వానికి కన్సల్టెన్సీల వినతి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ పునరుద్ధరణ పనుల డిజైన్లను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని పలు సంస్థల ప్రతినిధులు ఇరిగేషన్ శాఖ అధికారులను కోరారు. ఇప్పుడు విధించిన గడువు సరిపోదని, దానిని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. బ్యారేజీల పునరుద్ధరణకు కన్సల్టెన్సీని నియమించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కన్సల్టెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 15వ తేదీతో ఆ గడువు ముగిసిపోనుంది.
ఈ క్రమంలో ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీడీఓ అధికారులు ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీలతో జలసౌధలో సోమవారం ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాలుగు కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈవోఐ దాఖలుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోదని ప్రతినిధులు వెల్లడించారు. ఆ గడువును మరింత పొడగించాలని కోరారు. అదేవిధంగా డిజైన్లకు సంబంధించి పలు అంశాలను, వివరాలను కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.