
- హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో డేంజర్ కెమికల్స్!
- అధిక మోతాదులో సీసం, క్యాడ్మియం, నికెల్ లోహాలు
- పక్కనే బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
- ప్యూరిఫై చేసి తాగడానికి వాడుతున్న ప్రైవేట్ హాస్టల్స్, హోటల్స్
- వందల మంది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- బోర్లు వేసిన నిర్వాహకుడిపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ సున్నం చెరువులో ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయని హైడ్రా తన పరిశోధనలతో తేల్చింది. కలవరపడాల్సిన విషయం ఏమిటంటే ఈ చెరువు పక్కన మూడు బోర్లు వేసిన ఓ వ్యక్తి ఈ నీళ్లను ట్యాంకర్ల ద్వారా మాదాపూర్లోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యా సంస్థలు, హోటల్స్ కు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.
ఇందులో కొందరు ప్రైవేట్ హాస్టల్స్, హోటల్స్ నిర్వాహకులు ఈ నీటిని ప్యూరిఫై చేసి తాగడానికి ఉపయోగిస్తుండగా, ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి హాస్టల్స్లో వేల మంది స్టూడెంట్స్, జాబర్స్ఉంటున్నారు. ఐటీ కంపెనీల్లో సాఫ్ట్వేర్జాబ్స్చేసేవారితో పాటు ఐఐటీ, మెడికల్కోచింగ్ తీసుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. సున్నం చెరువు నీళ్ల సరఫరా విషయం బయటపడడంతో ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్న వ్యక్తిపై హైడ్రా కేసు నమోదు చేసింది.
ఎలా బయటపడిందంటే..
నగరంలోని ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవాలని హైడ్రా నిర్ణయించుకోగా, అందులో శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ మధ్య ఉన్న సున్నం చెరువుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో స్వచ్ఛమైన నీటితో ఉన్న ఈ చెరువు 20 ఏండ్ల నుంచి నాలాల ద్వారా వచ్చి చేరుతున్న మురుగుతో కలుషితమైంది. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో కంపుకొడుతోంది. 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్తే భరించలేని దుర్వాసన వస్తంది. దీంతో ఫస్ట్ ప్రయారిటీ కింద దాదాపు రూ.10కోట్లతో ఈ చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది.
ఇందులో భాగంగా ఐదురోజుల క్రితం ఇక్కడి భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంది. చెరువులోని నీళ్ల శాంపిల్స్తీసుకుంది. అలాగే, పక్కన వేసిన బోర్ల నుంచి తీసిన నీళ్లను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని తెలుసుకుని ఆ శాంపిల్స్తీసుకుంది. అలాగే వాటర్ట్యాంకర్లలోని నీళ్ల శాంపిల్స్ కూడా సేకరించింది. దీన్ని పీసీబీ సాయంతో టెస్టులకు పంపించింది. ఇందులో షాకింగ్నిజాలు వెల్లడయ్యాయి. పరీక్షలకు పంపిన నీళ్లలో 12 రెట్లు అధికంగా సీసం, 3 రెట్లు ఎక్కువగా కాడ్మియం, రెండు రెట్లు నికెల్ లోహాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ నీళ్లను ఎవరెవరు తాగుతున్నారు? వారి పరిస్థితి ఏమిటి అన్నదానిపై ఆరా తీసేందుకు సిద్ధమైంది.
పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ల నీటిలో 0.073 నుంచి 0.122 మిల్లీగ్రాములున్నట్టు పీసీబీ గుర్తించింది. అంటే ఇది ఉండాల్సిన దాని కన్నా 7 నుంచి 12 రేట్లు ఎక్కువ. ఈ నీళ్లను ఉపయోగిస్తే పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జ్ఞాపక శక్తి తగ్గుతుందని, రక్తహీనత సమస్య ఏర్పడడమే కాకుండా బాల్యం, చిన్న వయస్సులోనే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని, సంతానోత్పత్తిపైనా ప్రభావం చూపుతుందంటున్నారు.
మూత్రపిండాల సమస్యలు..
కాడ్మియం 0.003 వరకూ పర్వాలేదని, కానీ, సున్నం చెరువు పరిసరాల్లోని బోర్లలో 0.007 నుంచి - 0.010 వరకు ఉండడంతో మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లంటున్నారు. ఇంత మోతాదులో ఉన్న నీళ్లను తాగితే మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకు పోయి ఎముకల బలహీనతకు దారి తీస్తుందంటున్నారు. పైగా, క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ చెప్తోంది.
ప్యూరిఫై చేసినా, మరగబెట్టినా లాభం లేదు
సహజంగా నీటిని మరగబెట్టి, ప్యూరిఫై చేసి తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటుంటారు. కానీ, సున్నం చెరువలో ఉన్నటువంటి లోహాలు కలిసిన నీటిని ప్యూరిఫై చేసినా, మరగబెట్టినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్తున్నారు. వేడి చేసినప్పుడు సూక్ష్మక్రిములు నశించినా సీసం, కాడ్మియం, నికెల్ వంటి లోహాలు కరగకుండా మరింత దగ్గరగా చేరి ప్రమాదకరమవుతాయంటున్నారు. సున్నం చెరువు దగ్గరే కాకుండా నగరంలోని కాలుష్య సాగరాలు, మురుగు కాలువల చెంత ఉన్న నివాస ప్రాంతాల్లోని భూగర్భ జలాల పరిస్థితి ఇలాగే ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
కాలేయం ఖతమ్
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉండొచ్చు కానీ, సున్నం చెరువు సమీపంలోని బోర్ల నీటిలో 0.038 నుంచి - 0.046 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. మనం తాగే నీటిలో నికెల్ ఎక్కువగా ఉంటే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతింటుంది. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. అధిక ఒత్తిడికి గురై చిన్న వయస్సులోనే రక్తపోటుకు కారణమౌతుందని డాక్టర్లు చెబుతున్నారు
ఈ వాటర్ డేంజర్..
మనం తాగే నీటిలో సీసం, కాడ్మియం, నికెల్వంటి లోహాలు ఎక్కువగా ఉంటే మంచిది కాదు. ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. న్యూరాలజీ సమస్యలు, మెదడువాపు వచ్చే ప్రమాదముంది. నీటిని కాచి చల్లార్చి తాగినా ప్రయోజనం ఉండదు. స్కిన్, కళ్లు, చెవి సమస్యలు వస్తాయి. క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం ఉంది. గ్యాస్ర్టిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతారు.
డాక్టర్ విజయ్ భాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ట్రయల్స్అండ్ రీసెర్చ్ చైర్మన్