
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఐదు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో రెగ్యులరైజ్ చేయని ప్రభుత్వం.. జీతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా మానసిక వేధింపులకు గురిచేస్తోందని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ కమిషరేట్నుంచి నెలనెలా జీతాలు రిలీజ్ చేస్తున్నా.. ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లను మే నెలలో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది.
వివిధ కారణాలతో సుమారు 1,100 మంది క్రమబద్ధీకరణ కాలేదు. అయితే, సర్కారు జూనియర్ కాలేజీల్లో ఇంకా కాంట్రాక్టు లెక్చరర్లు సుమారు 450 మంది వరకు ఉన్నారు. వీరికి ఏప్రిల్ నుంచి వేతనాలు రావడం లేదు. ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోపక్క మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండ తదితర జిల్లాల్లో కొన్ని కాలేజీల్లో మార్చి నెలకు సంబంధించిన వేతనాలూ అందలేదని లెక్చరర్ల సంఘాల లీడర్లు చెప్తున్నారు.
నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్వేతనాలు రిలీజ్ చేయాలని కోరుతున్నారు. కాగా, మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదని, ఆ బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్లో ఉన్నాయని, వాటినీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.