గద్దర్కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం మావోయిస్ట్ వ్యతిరేఖ పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమేనని యాంటీ టెర్రరిజం ఫోరం(ATF) పేర్కొంది. గద్దర్ తన విప్లవ పాటలతో వేలాది మంది యువతను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి .. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందన్నారు.
నక్సలిజం సాధారణ పౌరులపై, జాతీయవాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటం చేసేందుకు గద్దర్ సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేశారని ఆరోపించింది. గద్దర్ లాంటి వ్యక్తికి తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని ఫోరం తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి భధ్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులు, ప్రజల త్యాగాలను అవమానించడమేనని యాంటి టెర్రరిజం ఫోరం(ATF ) పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది.
పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరింది. గద్దర్కు అధికారికంగా అంత్యకియలు జరిపితే.. ప్రభుత్వం మావోయిస్టు భాజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ యాంటీ టెర్రరిజం ఫోరం (ATF ) చేసింది.
ఈ సమయంలో చిల్లర రాజకీయాలంటే..
గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ చనిపోతే నిన్నటి నుంచి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అన్నారు. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదని హితవు పలికారు. గద్దర్ భౌతిక కాయం తరలింపు, అంత్యక్రియల ఏర్పాట్లను కొందరు తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో కూడా ఏర్పాట్లు చేశామని చెప్పుకుంటున్నారని..ఈ సమయంలో చిల్లర రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలని తలసాని సూచించారు.
ప్రజా గాయకుడు గద్దర్ సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ప్రజా యుద్ధ నౌక, ఒక గాయకుడు గద్దర్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని అన్నారు. అతను అందరి వ్యక్తి అన్నారు. గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్నారు. దీంట్లో ఎలాంటి మార్పు లేదని తలసాని స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
రాష్ట్రంలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ వెళ్లిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడి ఇబ్బందులు అక్కడే ఉన్నాయని గద్దర్ భావించారని చెప్పారు. దానిలో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో గద్దర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. గద్దర్ భావించిన .. ఉహించిన తెలంగాణ రాలేదని చాల బాధ పడ్డారని కిషన్ రెడ్డి తెలిపారు.