స్కూళ్లు తెరిచిన రోజే టీచర్ల సర్దుబాటు.. విద్యాశాఖ సెక్రటరీ వివాదాస్పద ఉత్తర్వులు

స్కూళ్లు తెరిచిన రోజే టీచర్ల సర్దుబాటు.. విద్యాశాఖ సెక్రటరీ వివాదాస్పద ఉత్తర్వులు
  • విద్యాశాఖ సెక్రటరీ వివాదాస్పద ఉత్తర్వులు
  • 13 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
  • పిల్లల సంఖ్యపై క్లారిటీ రాకుంటే అడ్జస్ట్​మెంట్ ఎలా ?

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ అధికారులు తీసుకున్న చర్యలు వివాదస్పదంగా మారాయి. జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కానుండగా.. అదే రోజు వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాలని ఆదేశాలివ్వడమే దీనికి కారణం. 13వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని హుకుం జారీచేశారు.

బడుల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ మంది టీచర్లున్న చోట.. అవసరమైనంత మంది టీచర్లను అడ్జెస్ట్ చేయాలని విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. తక్కువ మంది పిల్లలుండి, టీచర్లు ఎక్కువగా ఉన్న చోట నుంచి వారిని వేరే చోటకు అడ్జెస్ట్ చేయాలని సూచించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, బడులు తెరిచిన రోజే అడ్మిషన్లు ఎన్ని అనే విషయం ఎలా తెలుస్తుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.  

పది మంది వరకుంటే ఒక టీచర్.. 

ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పది మంది వరకూ పిల్లలుంటే.. ఒక టీచర్​ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. 11– 60 మంది ఉంటే ఇద్దరు, 61– 90 పిల్లలుంటే ముగ్గురు, 91– 120  మంది ఉంటే నలుగురు, 121 – 150 మంది ఉంటే ఐదుగురు, 151 – 200 మంది వరకూ పిల్లలుంటే ఆరుగురు టీచర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాతి ప్రతి 40 మంది పిల్లలకు ఒక టీచర్​ను అదనంగా పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 20 మంది పిల్లలుంటే ఇద్దరు టీచర్లు (ఒకరు లాంగ్వేజీ, మరొకరు నాన్ లాంగ్వేజీ) ఉండాలి, 21కిపైగా పిల్లలుంటే నలుగురు టీచర్లను ఏర్పాటు చేసుకోవాలి.   

ఇవేం ఉత్తర్వులు?: యూటీఎఫ్ 

సర్కారు బడుల్లో పిల్లల సంఖ్యను పెంచాలని చెప్తూ, టీచర్లను తొలగించడం ఏంటని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్ ప్రశ్నించారు. బడులు తెరిచిన మరుసటి రోజే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలివ్వడం వెనక ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదన్నారు. 

సర్దుబాటు ఇలా..

విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం టీచర్ల సంఖ్యలో మార్పులుంటే ముందుగా గ్రామ పంచాయతీ పరిధిలో, అక్కడ అవకాశం లేకుంటే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో, అప్పటికీ చాన్స్ లేకుంటే మండలం పరిధిలోని స్కూళ్లలో అడ్జెస్ట్ మెంట్ చేయాలని పేర్కొన్నారు. మండలంలోనూ అవకాశం లేకుంటే జిల్లా యూనిట్ గా సర్దుబాటు చేయాలన్నారు.