
బషీర్ బాగ్, వెలుగు : గణనాథుల నిమజ్జనం, శోభాయాత్ర నిర్వహణపై భాగ్యనగర గణేశ్ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మంగళవారం కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సమావేశంలో సిటీ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, భాగ్యనగర గణేశ్ఉత్సవ సమితి తరఫు నుంచి భగవంత్ రావు, రాఘవ రెడ్డి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు. శోభాయాత్రకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.
చార్మినార్, ఎంజే మార్కెట్, బషీర్ బాగ్లో ఉత్సవ సమితి ఏర్పాటు చేస్తున్న స్వాగత వేదికలు, శోభాయాత్ర సభల్లో పాల్గొననున్న వీఐపీల బందోబస్తు గురించి చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీకి గణేశ్ ఉత్సవాలు అంటే ఇష్టం లేదేమోనన్నారు. అందుకే బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ కో ఆర్డినేషన్ మీటింగ్కు హాజరుకాలేదన్నారు.
ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తోందని, కానీ చాలాచోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని.. చెట్లను కట్ చేసి రోడ్డుపై అలానే కొమ్మలను వదిలేశారన్నారు. హుస్సేన్సాగర్లోనే గణనాథుల నిమజ్జం జరుగుతుందని.. ఏ శక్తి ఆపలేదన్నారు.
శోభాయాత్ర, నిమజ్జనం రోజున కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నట్లు భగవంతరావు తెలిపారు.