ఐఎస్ఐఎస్ ఇచ్చింది..
టెర్రరిస్టులకు కరోనా అలర్ట్
జిహాదీలకు సూచనలు
ఇస్లామిక్ స్టేట్.. ప్రపంచంలోనే భయంకరమైన టెర్రరిస్ట్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులను పొట్టనబెట్టుకున్న టెర్రర్ గ్రూప్. అసలు ప్రజల ప్రాణాలంటే లెక్కే లేని ఐఎస్… కరోనా విషయంలో మాత్రం కళ్లు తెరిచింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా టెర్రరిస్టులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేగుతున్న నేపథ్యంలో వైరస్ ఎఫెక్టెడ్ దేశాలకు వెళ్లొద్దని టెర్రరిస్టులను ఆదేశించింది. తరచూ చేతులు కడుక్కోవాలని సూచించింది. అర్ధరాత్రి నిద్ర లేచినా హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పింది. అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండాలంది. ఈ మేరకు ఐఎస్ఐఎస్ జిహాదీలకు వరుసగా ఆదేశాలు జారీ చేసింది.
సింహం నుంచి తప్పించుకోండి…
ఇరాన్ కు చెందిన ఈ మిలిటెంట్ గ్రూప్ జిహాదీలకు మరికొన్ని సూచనలు కూడా చేసింది. ‘‘దేవుడిపై విశ్వాసం ఉంచండి. కరోనా మహమ్మారి ఒక కారణంతో వచ్చింది. దేవుడు ఎంచుకున్న వారికే ఇది సోకుతుంది” అని పేర్కొంది. సింహం బారి నుంచి ఎలాగైతే తప్పించుకుంటామో, అలాగే కరోనా పేషెంట్ల నుంచి తప్పించుకోవాలని చెప్పింది. బహిరంగంగా తుమ్మకూడదని, అలాంటి సమయంలో నోటికి, ముక్కుకు అడ్డుగా ఏదైనా పెట్టుకోవాలని, వైద్య నిపుణుల గైడ్లైన్స్ను పాటించాలని సూచించింది.