
- డీసీజీఐ ఆమోదంతో టెస్టింగ్స్
- అప్రూవల్స్ రాగానే ట్రయల్స్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అనేక దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యారు. ఇండియా సైంటిస్టులూ ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మల్టీ పర్పస్ వ్యాక్సిన్ ను మన సైంటిస్టులు టెస్ట్ చేస్తున్నారు. కుష్టు వ్యాధిని తగ్గించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో వినియోగించే ఎమ్ డబ్ల్యూ వ్యాక్సిన్ ను పరీక్షిస్తున్నారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ఇండియా (డీసీజీఐ) నుంచి ఆమోదం లభించడంతో టెస్టులు ప్రారంభించామని డా.శేఖర్ మండే తెలిపారు. కరోనా వైరస్ లో ఆరు నుంచి ఏడు జాతులున్నాయని, వాటిలో ఏయే జాతుల వైరస్ లు ఇండియాలో ఉన్నాయనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడమనేది సుదీర్ఘ ప్రక్రియ అని.. పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంకొన్ని అప్రూవల్స్ కోసం ఎదురు చూస్తున్నామని, అవి రాగానే ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. కాగా, కరోనా వైరస్ ను నివారించే నిర్దిష్టమైన వ్యాక్సిన్ రావడానికి కనీసం12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చని వరల్డ్ హెల్త్ఆర్గనైజేషన్ చెప్పింది.