పూర్తిగా నయం కావడంతో ఇంటికి పంపిన డాక్టర్లు
పద్మారావు నగర్, వెలుగు: కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందిన బాధితుడిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. అన్ని రకాలుగా కోలుకోవడం, మూడు దఫాలుగా చేసిన టెస్టుల్లో నెగెటివ్ రావడంతో శుక్రవారం రాత్రి ఇంటికి పంపించేశారు. 14 రోజుల పాటు బయటికి రాకుండా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా కేసు కథ ముగిసింది. సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి.. కొద్దిరోజుల కింద బెంగళూరు మీదుగా విదేశాలకు వెళ్లడంతో కరోనా బారినపడిన విషయం తెలిసిందే. మార్చి రెండో తేదీ ఉంచి ఆయనకు గాంధీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 88 మందికి టెస్టులు చేయించి, ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారించారు. పన్నెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. పూర్తిగా నయం కావడంతో అతడిని డిశ్చార్జి చేశామని, ప్రస్తుతం తెలంగాణ గడ్డమీద ఒక్కరికి కూడా కరోనా లేదని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.