కళ్లకలకతో బాధపడుతున్న వారికి కరోనా పాజిటివ్

కళ్లకలకతో బాధపడుతున్న వారికి కరోనా పాజిటివ్

సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వైరస్ పలు విధాలుగా మార్పులు చెందుతున్న సమయంలో .. వ్యాధి లక్షణాలు కూడా మారుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా వస్తోందని నిపుణులు చెపుతున్నారు. ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకుండానే ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. లేటెస్టుగా కంటి ద్వారా కూడా కరోనా వస్తోందంటున్నారు డాక్టర్లు.

హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.తమ దగ్గరకు ఆరుగురు పేషెంట్లు కళ్లకలకతో వచ్చారని.. వారికి టెస్టులు చేయిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. కళ్ల వెంట నీరు కారడం, కళ్లు ఎర్రబారడం, కళ్లు తడారడం వంటి సమస్యలు తలెత్తిన వారు వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, ఆయాసం వంటి లక్షణాలే కాకుండా కంటి దురద, కళ్లకలకలు వంటివి వచ్చినా కరోనా కోణంలో అనుమానించాల్సిందే అని సూచించారు. కరోనాతో కొందరిలో కంటిచూపు కూడా మందగిస్తోందని.. అయితే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే  కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు.