
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
ఏటూరునాగారం, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా ఫాం హౌస్కే పరిమితమైన సీఎం కేసీఆర్ ఇకనైనా ప్రజల మధ్యకు రావాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పర్యటించి కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్టైంలో నిరుపేదలు ఆకలితో అల్లాడుతుంటే సీఎం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని అరికట్టడంతో సీఎం ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి రూ. 6 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు, ఏటూరునాగారం సర్పంచ్ రామ్మూర్తి పాల్గొన్నారు.