సిమ్లా : కాటన్ క్యాండీ(పీచు మిఠాయి)ల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకంపై హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం శనివారం బ్యాన్ విధించింది. ఏడాది పాటు అంటే మార్చి 15, 2025 వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుందని తెలిపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పింది. ఫుడ్ సేప్టీ కమిషనర్ అండ్ హెల్త్ సెక్రటరీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఏడాది పాటు కాటన్ క్యాండీ నిల్వ, పంపిణీ, అమ్మడం నిషేధించినట్లు తెలిపారు. ప్యాకేజీ చేసినా, చేయకపోయినా ఈ నిషేధం అమలులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాటన్ క్యాండీల నమూనాలను పరిశీలించగా అనుమతి లేని రంగులను ఉపయోగించినట్టు తేలిందని పేర్కొన్నారు. వాటిలో ప్రమాదకరమైన రంగులు ఉన్నాయని వివరించారు. ఇటువంటి వాటితో ప్రజారోగ్యానికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి ముప్పని వెల్లడించారు.