నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో పత్తి మాఫియా పడగ విప్పింది. నిషేధిత బీజీ-3 విత్తనాలతో పాటు, ప్రస్తుతం వాడకంలో ఉన్నటువంటి బీజీ-2 సీడ్స్ను సైతం వక్రమార్గంలో సప్లై చేస్తున్నారు. సీడ్గ్రోవర్స్(పత్తి విత్తనాలు సాగు చేసే రై తులు) నుంచి అనధికారికంగా జరుగుతున్న దందాలో రైతులు మోసపోవడంతోపాటు, భూసారం విషతుల్యంగా మారే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణంలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉంది. పూర్తి సాగు విస్తీర్ణం 10.67 లక్షల ఎకరాలు కాగా, దీంట్లో పత్తి మాత్రమే 7.10 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. భారత ప్రభుత్వం నిషేధించిన బీజీ-3 విత్తనాలతో పాటు, ప్రస్తుతం సాగవుతున్న బీజీ-2 విత్తనాలను సైతం బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. జిల్లా పోలీస్శాఖ దాడుల్లో ఈ రెండు రకాల విత్తనాలు పట్టుబడ్డాయి. దీంతో పత్తి మాఫియా జిల్లాలో ఏరకంగా ప్రవేశించిందనే దానిపైన అటు పోలీస్, ఇటు వ్యవసాయ శాఖ కూపీ లాగుతోంది.
సూత్రధారులు సీడ్గ్రోవర్స్
కర్నూలు జిల్లా నంద్యాల కేంద్రంగా పత్తి విత్తనాల దందా ప్రారంభమైనట్లు గా పోలీస్శాఖ దాడుల్లో తేలింది. ఈ జిల్లాలో పత్తి విత్తనాలు పండించే సీడ్గ్రోవర్స్అనేకమంది ఉన్నారు. దీన్నే అదునుగా భావించిన అనాథరైజ్డ్డీలర్లు గ్రోవర్స్ కు అదనంగా డబ్బులు ఆశచూపి దొడ్డిదారిలో విత్తనాలు కొంటున్నారు. ఈ విధంగా కొంటున్న విత్తనాలను అనాథరైజ్డ్డీలర్లు ప్యాకెట్ల రూపంలో, బస్తాల్లో ప్యాకింగ్చేసి జిల్లాలకు సప్లై చేస్తున్నారు. వాస్తవానికైతే విత్తన కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించి పండించిన సీడ్స్ కొనుగోలు చేస్తుంటాయి. ఈవిధంగా కొన్న సీడ్స్ను ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేశాక, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించి ఓపెన్ మార్కెట్లో సప్లై చేస్తారు. కానీ అనాథరైజ్డ్డీలర్లు విత్తనాలను వివిధ రకాల కంపెనీల పేర్లతో ప్యాకెట్లలో ప్యాక్చేసి అడ్డదారిలో రైతులకు అమ్ముతున్నారు. దీనికోసం జిల్లాలో ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టుకున్నారు.
నిషేధిత కలుపు మందుతో పిచికారి
గ్రోవర్స్నుంచి కొన్న విత్తనాలపై అనాథరైజ్డ్డీలర్లు ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసిట్ద్రావకాన్ని నీటిలో కలిపి పిచికారి చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆరాక ప్యాకింగ్ చేస్తున్నారు. గ్లైఫోసిట్ వాడకం వల్ల కలుపు మొక్కలు నాశనమవుతాయని, పురుగు మందులు వాడాల్సిన అవ సరం లేదని రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నారు. పైగా బీజీ -2 విత్తనాల ప్యాకెట్ ధర రూ.750 కాగా, ఈ విత్తనాలు కేవలం రూ.4 00, 500కే అదీ రైతుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఉద్దెరకు అంటగడుతున్నారు.
మూతపడ్డ కంపెనీ పేరుతో..
పోలీస్శాఖకు పట్టుబడ్డ వాటిలో అక్షర, 108 సర్పంచ్గోల్డ్, రాజ్కోట్, బీజీ-3, బీజీ -2 విత్తనాలు ఉన్నాయి. అయితే దీంట్లో ‘అక్షర’ అనే కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కంపెనీ లైసెన్స్ఈ ఏడాది జూన్ 20 వరకు ఉన్నప్పటికీ ఏడాది క్రితమే కంపెనీ మూసేశారని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఈ కంపెనీ పేరుతోనే మిగతా విత్తనాలు ప్యాక్చేసి మా ర్కెట్లో సేల్ చేస్తున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి లైసెన్స్డీలర్లతోనే విత్త నాలు అంటగడుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాల నుంచి నిషేధిత విత్తనాలు జిల్లాకు సప్లై అయినట్లు పోలీస్శాఖ దాడుల్లో తేలింది. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై, ఒడిశా రాష్ట్రాల వరకు ఈ విత్తనాలు సప్లై అవుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఏపీలోని పల్నాడు, తెలంగాణలో భద్రాచలం వరకు ఈ సీడ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిసింది.
నల్గొండ జిల్లానే ఎందుకు?
రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగు విస్తీర్ణం నల్గొండ జిల్లాలోనే ఉండటంతో నిషేధిత విత్తనాలకు అడ్డాగా ఎంచుకున్నారు. ఏడు లక్షల ఎకరాల్లో సాగవుతున్న పత్తికి 16 లక్షల ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. దీంతో ఇక్కడైతే తమ దందాకు తిరుగులేదని భావించిన అనాథరైజ్డ్ డీలర్లు ఐదారు మండలాలపై ఫోకస్ పెట్టారు. అయితే జిల్లాలో ఈ వి త్తనాల వాడకం వెయ్యి నుంచి రెండు వేల ప్యాకెట్లకు మించి ఉండదని వ్య వసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో సీడ్కాస్ట్ రూ.1500 వరకు ఉండేది. కానీ ఇప్పుడు రూ.750కే లభిస్తోంది. అక్కడక్కడ ఐదారొందలకు కూడా అమ్ముతున్నారు. దీనికంటే వంద రెండొందల తక్కువ ధరకు నిషేధిత, నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
ఇల్లీగల్గా అమ్ముతున్నారు
సీడ్ గ్రోవర్స్నుంచి విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు నేరుగా అంటగడుతున్నారు. బీజీ-3 విత్తనాలు, గ్లైఫోసిట్ మందుపై నిషేధం ఉంది. ప త్తి పంట సాగయ్యే జూన్ నుంచి డిసెంబర్ వరకు గ్లైఫోసిట్ఉత్పత్తి చేయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అక్షర అనే సంస్థ మూతపడింది. ఈ కంపెనీ పేరుతో అనాథరైజ్డ్ డీలర్లు ఇల్లీగల్గా విత్తనాలు సేల్ చేస్తు న్నారు. నకిలీ బిల్లులు సృష్టించి రైతులను మోసం చేస్తున్నారు. ఈ విత్తనాల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ‑ శ్రీధర్ రెడ్డి, జేడీఏ

