- ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్ట్, మరొకరు పరార్
- 41 నకిలీ మద్యం బాటిళ్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లో ప్రీమియం బ్రాండెడ్ లిక్కర్ పేరుతో నకిలీ లిక్కర్ మిక్సింగ్ చేస్తూ విక్రయిస్తున్న ముఠాను సికింద్రాబాద్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. సాధారణ మద్యాన్ని ప్రీమియం లిక్కర్ బాటిళ్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ఈ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య, అధికారులు పక్కా సమాచారంతో రసూల్పుర మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తుల వద్ద ఆరు చివాస్ రీగల్ ప్రీమియం లిక్కర్ బాటిళ్లు లభించాయి. ప్రీమియం మద్యంలో తక్కువ ధర కలిగిన మద్యం కలిపినట్లు గుర్తించారు. నిందితులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే మాదాపూర్ లో మిక్సింగ్ లిక్కర్ తయారీ కేంద్రంపై దాడి చేసి 41 ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్కడ వివిధ రకాల 63 ప్రీమియం లిక్కర్ ఖాళీ బాటిళ్లు లభించాయి. రూ.25 వేల విలువైన రాయల్ సల్యూట్ వంటి ఖరీదైన బ్రాండ్ల బాటిళ్లలో కూడా నకిలీ మద్యం నింపి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఒడిశాకు చెందిన చికున్ స్వాయిన్, సోను మహంతిని అరెస్ట్ చేయగా, ప్రఫుల్ కుమార్ నాయక్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, ఏఈఎస్ శ్రీనివాసరావు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జనార్ధన్, రిజ్వాన్, సిద్ధిఖీ, అనూష పాల్గొన్నారు.
