డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు .. 49 కేంద్రాల్లో ఏర్పాట్లు

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు .. 49 కేంద్రాల్లో ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసింది. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న పది నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో చోట 14+1 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు తదితర నాలుగు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో ఈ స్థానాల్లో 20+1 టేబుళ్లు.. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్‌ తదితర ఆరు నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ 28+1 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఈసారి ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తి చేసేలా ప్లాన్‌ చేసింది. ఇందుకోసం 500 ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయనుంది. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుంటే, చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తర్వాతే చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.80 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.