తిరుపతిలో వైభవంగా గో మహోత్సవ వేడుకలు

తిరుపతిలో వైభవంగా గో మహోత్సవ వేడుకలు

దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో మంగళవారం(జనవరి 16) కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. 

గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2వేల500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుంచి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.

పూర్వకాలం నుంచి కనుమ పండుగ రోజున గోపూజకు చాలా ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వల్ల పాడి పంటలు పుష్కలంగా పండి.. లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 250 కోట్లకు పైగా ఎస్వీ గో సంరక్షణట్రస్టుకు దాతలు విరాళాలు అందించినట్లు వివరించారు.

అంతకుముందు గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు. తర్వాత గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దాణా అందించారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పుర ప్రజలను ఆకట్టుకున్నాయి. 

ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ గోసంరక్షణ ట్రస్టు సభ్యులు శ్రీ రాం సునీల్ రెడ్డి, శ్రీ శ్రీధర్, ఎవీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ సోమయాజులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.