
హైదరాబాద్సిటీ, వెలుగు: పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని లేకపోతే కేసులు పెట్టి లోపలేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. పేరెంట్స్ను వేధిస్తే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ‘గోల్డెన్ కేర్’ ప్రోగ్రామ్ను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వృద్ధులు ఆర్థికపరమైన మోసాలకు గురికాకుండా చూస్తాం. ఒకవేళ మోసపోతే పోలీసులను సంప్రదించేలా అవగాహన కల్పిస్తాం. కొడుకులు, కూతుళ్లు తమ పేరెంట్స్ను సరిగ్గా చూసుకోవాలి. శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తే చట్టప్రకారం వాళ్లు శిక్షార్హులు అవుతారు. రాచకొండ కమిషనరేట్లోని 47 పోలీస్స్టేషన్ల పరిధిలోంచి 470 మంది వృద్ధులను సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి వారం వారి బాగోగులు చూసుకుంటాం. ఏదైనా సమస్యలుంటే అండగా ఉంటాం’’అని సీపీ సుధీర్ బాబు తెలిపారు.