- సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అర్బన్ మండలం భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితుల్లో అర్హులైన వారందరికీ ఇంటి స్థలం, ఇండ్లు కేటాయించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఇండ్లు కూలగొట్టకుండా, అర్హులకు పట్టాలు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.
ప్రభుత్వం 311 మందికి పట్టాలు ఇచ్చిందని, ఇంకా చాలా మందికి పట్టాలు రాలేదన్నారు. భూదాన్ భూమిపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. అమెరికా దురాక్రమణ ముందు మోదీ ప్రభుత్వం తలవంచిందని విమర్శించారు. ఇరాన్ తో స్నేహపూర్వకంగా ఉంటూ ఆ దేశ సుప్రీం లీడర్ హత్యను ఖండించక పోవడం అన్యాయమన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణను భారత్ ఖండించి, యుద్ధాన్ని ఆపడానికి కృషి చేయాలని సూచించారు. యుద్ధం బూచీ చూపించి గ్యాస్ ధరలు పెంచడం, బ్లాక్ కు తరలించి కొరత సృష్టించడం సరైంది కాదన్నారు. గుండా సత్యనారాయణ రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, వరగాని కోటేశ్వరరావు పాల్గొన్నారు.
