
- చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం
- ఎస్ఐబీ లాగర్ రూమ్లో అధికారుల సోదాలు, సర్వర్లు సీజ్
- ధ్వంసమైన హార్డ్ డిస్క్ల డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం
- గత ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బేగంపేట్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) లాగర్ రూమ్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఈ సోదాల్లో ఎస్ఐబీ సర్వర్లను సీజ్ చేసినట్లు తెలిసింది. ధ్వంసమైన హార్డ్డిస్క్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఎవరెవరి ఫోన్ నంబర్లను ట్యాప్ చేశారు? ఎంతమంది వ్యక్తిగత వివరాలు రికార్డ్ చేశారు? అనేది సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారించాలని భావిస్తున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
న్యాయపరమైన అనుమతులు వచ్చిన తర్వాత ప్రణీత్రావును అదుపులోకి తీసుకుని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు దొరకకూడదనే హార్డ్డిస్క్లు, సీడీఆర్, ఐఎంఈఐ నంబర్స్ డేటాను ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
ట్యాపింగ్ కోసమే ఎస్ఐబీ..
పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసి పదవీ విరమణ చేసిన ప్రభాకర్రావును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఐబీ చీఫ్గా నియమించింది. అదే సమయంలో ప్రణీత్ రావుకు ఎస్ఐబీలో కీలక విభాగంలో పోస్టింగ్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నోళ్లపై ఎస్ఐబీ ద్వారా నిఘా పెట్టిందని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల వివరాలను సేకరించిందని ఆరోపణలున్నాయి. తమ ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్చేస్తున్నదని గతంలో ప్రతిపక్ష నేతలు చెప్పారు.
లాగర్ రూమ్లో సీక్రెట్ ఆపరేషన్స్..
బేగంపేట్లోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దనే ఎస్ఐబీ కార్యాలయం ఉంది. ఇక్కడ జరిగే కార్యకలాపాలు బయటకు తెలిసే అవకాశం లేదు. ఇదే అదనుగా ఇక్కడి నుంచి వ్యవహారం నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని ఎస్ఐబీలోని లాగర్ రూమ్లో భద్రపరిచారు. ఇందులో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు సహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసినోళ్ల పూర్తి వివరాలను దాదాపు50 హార్డ్ డిస్క్లలో స్టోర్ చేసినట్టు సమాచారం.
దొరికిపోతామనే ధ్వంసం చేశారా?
ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్, రికార్డింగ్ చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ట్యాపింగ్ చేయాల్సిన అవసరమేంటో సరైన కారణాలు చెప్పాలి. అయితే రాజకీయ నాయకుల ఫోన్లను అధికారికంగా ట్యాప్ చేయడం సాధ్యం కాదు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.