
- ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే నం.1 స్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కోహెడ వద్ద నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ కె.రామకృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్లో కోహెడ మార్కెట్ అంశంపై సీఎస్ సమీక్షించారు. దేశంలోనే రోల్ మోడల్ మార్కెట్ను నిర్మించాలని సీఎం నిర్ణయించారని సీఎస్ తెలిపారు. 250 ఎకరాల్లో ఆధునిక వసతులు, కోల్డ్ స్టోరేజ్లు, షెడ్లు, విశాలమైన రోడ్లతో మార్కెట్ను నిర్మించాలని సూచించారు.
డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ మార్కెట్ను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో విస్తారంగా పండే మామిడి, బత్తాయి, పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేలా రైతులు, వినియోగదారులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. కోహెడ మార్కెట్ ఏర్పాటుకు రూ.2890 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు సీఎస్కు తెలిపారు. భూ సేకరణ, రోడ్లు, ఆధునిక షెడ్లు, సోలార్ రూఫ్ టాప్లు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం కోసం నిధులు కావాలని కోరారు. ఈ సమావేశంలో కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్ర మోహన్, అదనపు డైరెక్టర్ లక్ష్మీ బాయి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.