హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులను ఆదివారం చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు పరిశీలించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు, అలాగే శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు సాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. బేగంపేట విమానాశ్రయం వద్ద భూగర్భ సొరంగం నిర్మాణ అనుమతులు, రక్షణ శాఖ భూముల సేకరణ, పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎన్ హెచ్-44 ఎలివేటెడ్ కారిడార్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత కీలకమని, సీఎం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎస్ స్పష్టం చేశారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి, అనుకున్న గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ (18.18 కి.మీ) కారిడార్లో భాగంగా కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లోని ర్యాంపులు, హకీంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫ్రాజ్ అహ్మద్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్ తీసుకురండి
సిటీలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఉమ్మడి పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఆదివారం బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో హెచ్ఎంఆర్ఎల్, టీజీఎస్ ఆర్టీసీ, విద్యుత్, జలమండలి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మెట్రో, బస్సుల్లో సులభంగా ప్రయాణించేలా నెలవారీ, రోజువారీ ఉమ్మడి పాస్ లను జారీ చేయాలని సూచించారు. దీనికి సంబంధించి ఉమ్మడి చార్జీలను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు.
ఈ విధానం అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ మెట్రో, ఆర్టీసీ అధికారులు సీఎస్ కు వివరించారు. ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ విస్తరణ పనులపై సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టాల్సిన 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సీఎస్ సంజయ్ జాజు బేగంపేట్ నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ క్రమంలో రైళ్ల నిర్వహణ, స్టేషన్లలో రద్దీ, ప్రయాణికులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఎన్హెచ్-44పై హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను కూడా పరిశీలించారు.
