పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ టౌన్లో ‘దహీ హండి’ వేడుకల్లో గాయపడిన ‘గోవిందా’లకు సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో వివాదం చెలరేగింది. బిల్లు విషయంలో శివసేన నేతలు ఆస్పత్రి సిబ్బందితో గొడవపడ్డారు. సిబ్బందిపై దాడి చేసి భయాందోళనకు గురిచేశారు.
యాజమాన్యం ఫిర్యాదుతో 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో శివసేన నేతలు కుందన్ బాలకృష్ణ సాంకే, రాహుల్ రామ్దాస్ ఘరాత్, స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గవిత్ కొడుకు రోహిత్ గవిత్ ఉన్నారు. శనివారం రాత్రి దహీ హండి సందర్భంగా మానవ పిరమిడ్ ఏర్పాటు చేస్తూ గాయపడిన ఐదుగురికి పాల్ఘర్లోని రిలీఫ్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు.
అయితే, బిల్లు చెల్లింపు విషయంలో నెలకొన్న వివాదంతో దాదాపు 20 మంది ఆస్పత్రిలోకి చొరబడి లేడీ డాక్టర్ లిజోమోల్ను తిట్టడంతోపాటు రిసెప్షనిస్ట్ను చెంపదెబ్బ కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
