రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. సెప్టెంబర్ 10న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన రవితేజ మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం రూటెడ్ అండ్ రస్టిక్గా ఉంటుంది.
తెలంగాణ మైసాపురం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మాధవ్ ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంది. సినిమా సక్సెస్ సాధించి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. హీరో మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో ఒక మనిషికి, దున్నపోతుకి మధ్య ఎమోషనల్ బాండింగ్ను చూస్తారు’ అని చెప్పాడు.
ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ దీపా బాలు చెప్పింది. సెప్టెంబర్ 10 నుంచి ‘మారెమ్మ’ జాతర మొదలు కాబోతుందని, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారని దర్శకుడు మంచాల నాగరాజు అన్నాడు. ‘మారెమ్మ’ ప్రతి ఊరి కథ అని అందరికీ నచ్చుతుందని నిర్మాత మయూర్ రెడ్డి అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
