ఇటీవల హైదరాబాద్ లో సంభవించిన వరద వల్ల భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ వరద ముప్పు నుంచి లోతట్టుప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే దసరా పర్వదినం సందర్భంగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో వరద సహాయక చర్యలు పూర్తయ్యేందుకు కీలక పాత్ర పోషించిన మున్సిపల్ శాఖ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో భాగంగా 80 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ఈ విజయదశమి వేళ రాష్ర్ట ప్రజలకు అంతా శుభమే జరగాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు.