పది రోజుల క్రితం 500 మెగా వాట్లు.. తాజాగా 600 మెగావాట్ల ప్లాంట్ షట్డౌన్
మొత్తం 1100 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేత.. తరుచూ సమస్యలతో కోట్ల నష్టం
జయశంకర్ భూపాలపల్లి, రేగొండ, వెలుగు: తెలంగాణకు వెలుగులు పంచే కేటీపీపీని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. నిరంతర అంతరాయాలు, సాంకేతిక పరమైన లోపాలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. బాయిలర్ ట్యూబ్ల లీకేజీలు, ఇతర టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి తరచూ ప్లాంట్లు షట్డౌన్ అవుతున్నాయి. దీంతో జెన్కో కు కోట్ల రూపాయిల నష్టం వస్తోంది. ఒక్క రోజు ప్లాంట్ నిలిచిపోతే సంస్థకు రూ. 5 కోట్ల నష్టం. ఏడాదిగా ఈ సమస్యలతో 1400 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తిని కోల్పొయినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో కాకతీయ థర్మల్పవర్ ప్రాజెక్ట్(కేటీపీపీ) ఆధ్వర్యంలో 1100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. పది రోజుల క్రితం హౌ-రిల్ పవర్ ఉత్పత్తి కారణంగా 500 మెగావాట్ల ప్లాంట్ షట్డౌన్ అయింది. శనివారం రాత్రి 600 మెగావాట్ల ప్లాంటులో హెచ్పీ బైపాస్వాల్స్ లీకేజీతో ఇంజినీర్లు ఉత్పత్తి ఆపేశారు. దీంతో ప్లాంట్కరెంట్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఏడాదిగా కేటీపీపీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సార్లు కరెంట్ ఉత్పత్తి నిలిచి పోయింది. దీనికి తోడు భారీ వర్షాలతో జల విద్యుదుత్పత్తి కేంద్రాల(హైడల్ పవర్ పాంట్ల) నుంచి హై-రిల్ విద్యుత్ ఉత్పత్తి ఉండటంతో 10రోజుల క్రితం మొదటి దశ ప్లాంటును షట్డౌన్ చేశారు. ఇలా చాలా సార్లు బంద్చేయాల్సి వచ్చింది.
రెండో దశలో భారీ నష్టాలు
రెండో దశలో 600 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంటును సాంకేతిక సమస్యలు వదలడం లేదు. తరుచు సతాయిస్తోంది. రిపేర్లు చేస్తున్నా ప్రాబ్లమ్స్కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్నెలల్లో విద్యుత్ అయస్కాంత వాహకాలు తెగి రూ.36 కోట్ల విలువ గల రోటార్ మొరాయించింది. రెండు నెలల పాటు ప్లాంటు పూర్తిగా ఆగిపోగా… రిపేర్ల తర్వాత ఫిబ్రవరి 4న రీస్టార్ట్ చేశారు. కానీ ఫిబ్రవరి27న మరోసారి ప్లాంటు నిలిచి పోయింది. ఏప్రిల్, జూన్, జులై, ఆగస్టు ఇలా దాదాపు ప్రతినెల లోనూ ప్లాంటు ఆగిపోయింది. అక్టోబర్లో హెచ్పీ బైపాస్వాల్స్ లీకేజీతో ఉత్పత్తి ఆగింది. మొత్తంగా రెండు దశల్లోని 1,100 మెగావాట్ల ప్లాంటు సమస్యలో కరెంట్ సప్లై చేయడం లేదు.