
బషీర్బాగ్, వెలుగు: విదేశాల్లో ఉంటున్న తన బంధువుల ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్కు చెందిన 37 ఏండ్ల వ్యక్తి మేనల్లుడు సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. అతని ఫొటోను వాట్సాప్ డీపీగా ఉపయోగించి స్కామర్లు చాట్ చేశారు. తన వద్ద కొంత డబ్బు ఉందని, వాటిని తీసుకొని అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలన్నారు. బాధితుడు నిజమేనని నమ్మి అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలిపాడు. సిటీ బ్యాంక్కు సంబంధించిన వోచర్ను స్కామర్లు పంపించి, ఒక లక్ష పంపించానని తెలిపారు.
మరుసటి రోజు ఫోన్ చేసిన స్కామర్స్ తన పాస్ పోర్ట్ , వీసాలో సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు ఏజెంట్కు రూ.లక్షన్నర పంపించాలని కోరారు. అదనంగా రూ.50 వేలు కలిపి పంపిస్తే తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. బాధితుడు నమ్మి అడిగిన డబ్బును బదిలీ చేశాడు. అలాగే పలు దఫాలుగా మొత్తం రూ. 1.90 లక్షలు చెల్లించాడు. మళ్లీ డబ్బుల అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.