
బషీర్బాగ్, వెలుగు: ఫేక్ ఆన్లైన్ షాపింగ్వెబ్సైట్తో సిటీకి చెందిన ఓ యువతిని సైబర్నేరగాళ్లు చీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో సంప్రదించి రూ.1.09 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన యువతి(19) స్టూడెంట్. కొన్నిరోజుల కింద ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ వచ్చింది. దానికి ఆమె స్పందించగా, తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ఫోన్ నంబర్(+880 1723-155742) నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
అందులోని టెలిగ్రామ్ లింక్ https://oquubd0.com/login క్లిక్ చేసి, అక్కడ ‘మీ షో’ పేరుతో ఉన్న సైట్లో లాగిన్ అవ్వాలని స్కామర్లు యువతిని నమ్మించారు. మొదట రూ.వెయ్యి పెట్టుబడికి రూ.228 లాభం చూపించారు. తర్వాత రూ.500 ఇన్వెస్ట్ చేయమని సూచించారు. అలా పలుసార్లు చిన్న చిన్న లాభాలు చూపించారు. నిజమేనని నమ్మిన యువతి వేలల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఓ ఫేక్ ట్రేడింగ్ యాప్ లో లాభాలు వచ్చినట్లు స్కామర్లు చూపించారు.
రోజురోజుకు లాభాలు పెరగడంతో యువతి స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరీ రూ.లక్షా9 వేల 404 ఇన్వెస్ట్ చేసింది. ఆ మొత్తానికి స్కామర్లు ఫేక్ యాప్లో రూ.1.81 లక్షల లాభం చూపించారు. కానీ లాభం పైసలను విత్డ్రా చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. మరో రూ.58వేలు ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఆ తర్వాత నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.