నీ అప్పులు తీరుస్తానంటూ.. మహిళకు సైబర్ క్రిమినల్స్ బురిడీ.. రూ.63 వేల700 స్వాహా

నీ అప్పులు తీరుస్తానంటూ.. మహిళకు సైబర్ క్రిమినల్స్ బురిడీ.. రూ.63 వేల700 స్వాహా

జూబ్లీహిల్స్, వెలుగు: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను విదేశాల నుంచి ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి డబ్బులు కొట్టేశారు. యూసుఫ్​గూడ రహమత్​నగర్​కు చెందిన మహిళకు ఈ నెల 13న విశాల్ చోప్రా అంటూ ఓ వ్యక్తి యూకే నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు. ఆమెను వాట్సాప్​ద్వారా సంప్రదించి పేదలకు సహాయం చేస్తానని, అప్పులు తీర్చేందుకు డబ్బు ఇస్తానని నమ్మబలికాడు. 

తాను విదేశీ కరెన్సీతో ఇండియాకు వచ్చానని, కానీ కస్టమ్స్ వద్ద తనకు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించడానికి తక్షణ డబ్బు అవసరం ఉందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన సదరు మహిళ యూపీఐ ద్వారా రూ.63,700 ట్రాన్స్​ఫర్​చేసింది. డబ్బులు పంపిన తర్వాత ఆ వ్యక్తి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి  సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి కేసును మధురానగర్ పోలీస్ స్టేషన్‌‌కు  బదిలీ చేశారు.