దళితబంధు వెహికల్స్​ అమ్ముకున్నరు

దళితబంధు వెహికల్స్​ అమ్ముకున్నరు

కమలాపూర్, వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఫోటో సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధు యాప్​లో పని చేయలేమని, ఆ పని నుంచి వెసులుబాటు కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు శనివారం కమలాపూర్​ఎంపీడీవో పల్లవికి వినతిపత్రం అందజేశారు. హుజురాబాద్​నియోజకవర్గవ్యాప్తంగా దళితబంధు పథకంలో గుర్తించిన లబ్ధిదారులకు ఇప్పటివరకు 80 శాతం యూనిట్లను అందజేశారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు యాప్​లో యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల వివరాలు, వారి ఫోటోను పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. వారం క్రితం ఇదే విషయంపై ఎస్సీ కార్పొరేషన్​ నుంచి గూగుల్​ మీటింగ్​ నిర్వహించారు. దళితబంధు పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, యాప్​కు తాము పని చేయలేమని మీటింగ్​లో పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెప్పారు. అయినప్పటికి ప్రభుత్వం యాప్​విషయంలో తగ్గలేదు. దీంతో కమలాపూర్​మండలంలోని పలు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు శనివారం ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి ఎంపీడీవో పల్లవికి వినతిపత్రం అందించారు. 

దళితబంధు పథకం కింద తీసుకున్న వెహికల్స్​ను చాలామంది లబ్ధిదారులు అమ్ముకున్నారని, ఇంకొందరు వెహికల్స్​ను వేరే ప్రాంతాలకు లీజుకు ఇచ్చారని చెప్పారు. అలాగే యూనిట్లలో షాపుల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, ఒక్కో షాపుపై  ముగ్గురు నలుగురు లబ్ధిదారులు దళితబంధు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై అడిగితే లబ్ధిదారులు స్పందించడం లేదన్నారు. ఫోన్లకు రెస్పాండ్​కావడం లేదని, యూనిట్ల విషయంలో సరైన ప్రణాళిక లేకుండా స్కీంను అమలు చేసి ఇప్పుడు ఫోటోలను లోడ్​చేయమటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. యాప్​ పనుల నుంచి పంచాయతీ కార్యదర్శులను తప్పించాలని కోరారు.