బీఆర్ఎస్ ​లీడర్లు సతాయిస్తున్నరు .. దళితబంధు పథకాన్ని పంచుకొమ్మంటున్నరు!

బీఆర్ఎస్ ​లీడర్లు సతాయిస్తున్నరు ..  దళితబంధు పథకాన్ని పంచుకొమ్మంటున్నరు!
  • బీఆర్ఎస్ ​లీడర్లు సతాయిస్తున్నరు 
  • పంచుకునుడు కాదు...ఊళ్లోని దళితులందరికీ స్కీం ఇవ్వాల్సిందే
  • మహబూబాబాద్​ జిల్లా కంబాలపల్లి వాసుల రాస్తారోకో 
  • వర్షంలోనూ హైవేపై నిరసన 

మహబూబాబాద్, వెలుగు: దళిత బంధు స్కీమ్​వస్తే యూనిట్లను పంచుకోవాలని లీడర్లు సతాయిస్తున్నారని, ఊరిలోని అర్హులంందరికీ దళితబంధు వర్తింపజేయాలని డిమాండ్​చేస్తూ మహబూబాబాద్​ మండలం కంబాలపల్లి దళితులు మహబూబాబాద్​–నర్సంపేట జాతీయ రహదారి పై కంబాలపల్లి బస్టాండ్​సెంటర్​ వద్ద రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 175 మాదిగ, 40 మంది బుడగ జంగాలు, 20 మంది మాలలు, 6 బైండ్ల  కుటుంబాలకు చెందిన దళితులున్నారన్నారు. 

మహబూబాబాద్​ఎమ్మెల్యే బానోతు శంకర్​నాయక్​ సిఫారసు మేరకు ఆఫీసర్లు  గ్రామానికి 14 దళితబంధు యూనిట్లను మంజూరు చేశారని, అయితే, కొంతమంది బీఆర్ఎస్​లీడర్లు వాటిని 11 మంది కలిసి పంచుకోవాలని వెంటపడుతున్నారని ఆరోపించారు.  కటుంబంలో అన్నకు వస్తే తమ్ముడితో...తమ్ముడికి వస్తే అన్నతో...ఒకవేళ ఎవరూ లేకపోతే ఊరిలోని వేరే దళితులతో రూ.5 లక్షల చొప్పున యూనిట్లను షేర్​చేసుకోవాలంటున్నారని చెప్పారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికి వస్తే వాళ్లే తీసుకుంటారని, ప్రభుత్వమే గ్రామంలో మిగిలిన వారందరికీ దళితబంధు మంజూరు చేయాలని డిమాండ్​చేశారు. బీఆర్ఎస్​లో మొదటి నుంచి ఉన్న దళితుల కుటుంబాలకు ప్రయోజనం దక్కుతలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఇది వరకే ఎస్సీ కార్పొరేషన్​ లోన్లు తీసుకున్న వారికి, అసైన్డ్​ భూములు పొందిన వారికి దళిత బంధు స్కీమ్​లో తొలి ప్రాధాన్యతను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కురుస్తున్నా రాస్తారోకో కంటిన్యూ చేయడంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ ​జామయ్యింది. దీంతో మహబూబాబాద్​రూరల్​ఎస్సై రామ్​చరణ్​ అక్కడికి వచ్చి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.