
హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖకు ప్రతినెలా రూ.536 కోట్లు తప్పనిసరిగా కేటాయించాలని మంత్రి భట్టి విక్రమార్కను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని భట్టికి దామోదర ఓ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
ఈ నిధుల్లో ఆరోగ్యశ్రీ కోసం రూ.100 కోట్లు, మందుల కొనుగోలుకు రూ.50 కోట్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు రూ.186 కోట్లు, రోగుల ఆహార ఖర్చులకు రూ.6.50 కోట్లు, డీఎంఈ పరిధిలోని ఐఎఫ్హెచ్ఎస్ సేవలకు రూ.22 కోట్లు, విద్యుత్ బిల్లులకు రూ.10 కోట్లు, డాక్టర్ల స్టైపెండ్కు రూ. 47 కోట్లు, సివిల్ వర్క్స్కు రూ. 100 కోట్లు కేటాయించాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిధులను గ్రీన్ చానెల్ ద్వారా తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.