
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఓయూ పరిపాలనా భవన్లో తాజా మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్నుంచి వర్సిటీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ఓయూకు వీసీగా బాధ్యతలు తీసుకోవటం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
తన పరిధి మేరకు ఓయూలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరంతర ఉత్సాహం, ఉత్తేజంతో విభిన్న రంగాల్లో నాయకత్వాన్ని అందించిన ఘనత ఓయూ సొంతమని చెప్పారు. తాను ఎన్నో కీలక పదవులు చేపట్టినప్పటికీ, ఉస్మానియా ఇన్చార్జ్వీసీగా బాధ్యతలు తీసుకోవటం భిన్నమైన అనుభూతిని ఇస్తోందన్నారు. పలు విభాగాల డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు దానకిశోర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.