కవిత గొప్ప పనిచేసినట్లుగా..మంగళహారతులిస్తున్నారు

కవిత గొప్ప పనిచేసినట్లుగా..మంగళహారతులిస్తున్నారు

సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో మాఫియా డాన్ అవతారం ఎత్తిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కవితకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా ఉండేందుకు.., ప్రజల దృష్టి మళ్లించేందుకు బండి సంజయ్ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. లిక్కర్, డ్రగ్, సాండ్ మాఫియాతో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందన్నారు. కోట్ల రూపాయల దొంగ సొమ్మును దండుకునేందుకే లిక్కర్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను దాసోజు శ్రవణ్ పరామర్శించారు. లిక్కర్ మాఫియాకు, అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా బిజెపి  పోరాటం కొనసాగిస్తుందన్నారు.

పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు..
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల బెదిరింపు ధోరణులు కొనసాగుతున్నాయని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధేయ పద్ధతిలో ధర్మదీక్షకు కూర్చుంటే అక్రమంగా అరెస్టు చేసి కరీంనగర్కు తరలించారని తెలిపారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న బండి సంజయ్ గొంతును నొక్కాలని అరెస్టు చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా..పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదన్నారు. 

సస్పెండ్ చేయాల్సింది పోయి..మంగళహారతులా..?
లిక్కర్ మాఫియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వస్తే..ఆమె ఏదో గొప్ప పని చేసినట్టుగా మంత్రులంతా వెళ్లి కవితకు మంగళహారతులు పట్టి స్వాగతిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. కేసిఆర్కు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. తన కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారని ఫైర్ అయ్యారు.