
హైదరాబాద్: కేసీఆర్ తీరు తెలంగాణ ప్రజల ప్రాణాల పాలిట శాపంగా మారిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తెచ్చిన జీవో 248ను ఏ ప్రైవేట్ హాస్పిటల్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం గడ్డి పీకుతోందా అని ప్రశ్నించారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తోందన్న ఆయన..దోపిడీ మీద ఎందుకు రివ్యూ చేయలేదన్నారు. కరోనా వస్తే ప్రజలు పుస్తె మట్టెలు అమ్ముకున్నా ఫీజులు కట్టలేక పోతున్నారన్నారు. వాటిని నియంత్రించే దమ్ములేకపోతే గద్దె డిగిపోండని సీరియస్ అయ్యారు.
మాస్కులు పెట్టుకోని వారి నుంచి రూ. 30 కోట్లు ఫైన్ వసూలు చేశామని గొప్పగా చెబుతున్నారు కానీ.. జీవో ఉల్లంగిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎందుకు ఫైన్ వసూల్ చేయలేదని ప్రశ్నించారు. హెల్త్ మినిష్టర్ లేని రాష్ట్రం దేశంలోనే తెలంగాణ తప్ప ఏదీ లేదని..తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సామాజిక భద్రత కల్పించాలని తెలిపారు శ్రావణ్.