
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి స్లమ్లో సీసీ రోడ్డు వేయకుండా బిల్లులు కాజేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం చర్యలు తీసుకున్నారు. వర్క్ఇన్ స్పెక్టర్, ఇన్చార్జి ఏఈ అన్సారీని విధుల నుంచి తొలగించారు. డీఈ, ఇన్చార్జీ ఈఈ ఏకాంబరంను సస్పెండ్ చేశారు.
పనులు చేయకుండా ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ.9 లక్షల బిల్లులు విడుదల చేయడంపై ఇటీవల కమిషనర్ విచారణకు ఆదేశించారు. వీరిద్దరి ప్రమేయం ఉండడంతో చర్యలు తీసుకున్నారు. సదరు సంస్థ నుంచి రూ 8.93 లక్షలను రికవరీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరు క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును సైతం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.