ఆన్లైన్లో ఆధార్ కార్డులో ఫ్రీగా మార్పులు చేసుకోవాలి అనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. ఆధార్ లో తప్పులు సవరించుకునేందుకు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. వాస్తవానికి ఈ గడువు 2023 డిసెంబర్ 14తో ముగియనుంది.
ఈ క్రమంలో కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరో మూడు నెలలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. పబ్లిక్ నుంచి పాజిటివ్ స్పందన వస్తుండటంతో గడువు పెంచాలని నిర్ణయించినట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే గడువు ముగిసిన తరువాత అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఫీజు కట్టాల్సింది ఉంటుంది.
అప్డేట్ చేసుకోండిలా..
* https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
* ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు ‘ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్లోడ్ చేయాలి
* అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి
* రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్పై క్లిక్ చేయాలి.
* తర్వాత కనిపించే డ్రాప్డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
* ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
* 14 అంకెల ‘అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
* ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ 1947 నంబర్ను సంప్రదించవచ్చు.