న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపేస్తామని ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు ముంబై పోలీసులు మంగళవారం తెలిపారు. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన నిందితుడు.. తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కు చెందిన సభ్యుడినని చెప్పినట్లు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టామని, ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని వివరించారు.
ముంబైలోని జేజే హాస్పిటల్ను కూడా పేల్చేస్తామని నిందితుడు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. మోదీని, యోగీని చంపేందుకు స్కెచ్ వేయాల్సిందిగా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తనకు సుపారీ ఇచ్చినట్లు చెప్పాడన్నారు. బెదిరింపు కాల్స్ ఎందుకు చేశాడనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.