హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, సీఎం ప్రత్యేక సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి బంజారాహిల్స్లోని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో కేకేతో పాటు ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వనించారు. భేటీ అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని దీపా దాస్ మున్షీ ఆహ్వానించారని తెలిపారు. అయితే, ఆ పార్టీలోకి వెళ్లాలా లేదా అన్న విషయంపై కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు చెప్పకుండా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోనని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మేయర్ సిద్ధంగా ఉన్నారని, నాలుగైదు రోజుల్లో ఆమె పార్టీ మారుతారని అనుచరులు చర్చించుకుంటున్నారు.