దోస్త్ కు ఆదరణ .. ప్రారంభమైన ఫేజ్​-2 ఆన్​లైన్​ అప్లికేషన్​ ప్రక్రియ

దోస్త్ కు ఆదరణ .. ప్రారంభమైన ఫేజ్​-2 ఆన్​లైన్​ అప్లికేషన్​ ప్రక్రియ
  • మొదటి విడతలో 3,358 మందికి సీట్ల కేటాయింపు

​మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు : డిగ్రీ ఆన్​లైన్​ సర్వీస్​ తెలంగాణ(దోస్త్​)కు స్టూడెంట్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఇటీవల పూర్తి కాగా.. రిజల్ట్స్​ రాగానే పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యే చాన్స్​ ఉంది. 

ఫేస్–​1లో 3,358 మందికి సీట్లు..​

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 79 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 3 సోషల్​ వెల్ఫేర్​ డిగ్రీ కాలేజీలు, 3 ట్రైబల్​ వెల్ఫేర్​ కాలేజీలు, 4 బీసీ వెల్ఫేర్, 3 ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ కాలేజీలు, 26 గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలతో పాటు 40 ప్రైవేట్​ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలన్నీ మహబూబ్​నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, కొడంగల్, రంగారెడ్డి, షాద్​నగర్, నాగర్​కర్నూల్, ఫరూక్​ నగర్​ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే గత నెల ఇంటర్​​పరీక్షల ఫలితాలు రిలీజ్​ కావడంతో హయ్యర్​ ఎడ్యుకేషన్(టీఎస్​సీహెచ్ఈ) డిగ్రీ సీట్ల భర్తీకి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో ఆయా యూనివర్సిటీల కింద డిగ్రీలో చేరికలకు ‘దోస్త్’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించారు. 

ఈ అకడమిక్​ ఇయర్​లో దోస్త్  ఆన్​లైన్​ అప్లికేషన్  ఖాళీలు 30,820 ఉన్నాయి. మే 3 నుంచి 21 వరకు ఫేస్–1 కింద రూ.200 ఫీజుతో రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. అదే నెల 10 నుంచి 22 వరకు వెబ్​ ఆప్షన్స్​ అందుబాటులోకి తెచ్చారు. 29న 3,358 మందికి సీట్లను అలాట్​మెంట్​ చేశారు. వారంతా జూన్​ 6 వరకు సెల్ఫ్​​రిపోర్టింగ్​ చేయాల్సి ఉంటుంది. ఫేస్–-2 కింద ఈ నెల 8 వరకు రూ.400 ఫీజుతో స్టూడెంట్లు ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. వీరికి 13 న సీట్లను అలాట్​ చేయనున్నారు. 

సీట్లను పొందిన స్టూడెంట్లు జూన్​ 18 లోపు సెల్ఫ్​​రిపోర్టింగ్​ చేయాల్సి ఉంటుంది. ఫేస్–-3 కింద జూన్​ 13 నుంచి రూ.400 ఫీజుతో 19 వరకు స్టూడెంట్లు ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. 13 నుంచి 19 వరకు వెబ్​ ఆప్షన్స్​ను అందుబాటులో ఉంచి, 23న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన స్టూడెంట్లు 28 లోపు సెల్ఫ్​​రిపోర్టింగ్​ చేయాల్సి ఉంటుంది. మూడు ఫేస్​లలో సీట్ల భర్తీ పూర్తి కాగానే.. జూన్​ 30నుంచి క్లాసులు ప్రారంభించనున్నారు. 

మూతబడుతున్న ప్రైవేట్​ కాలేజీలు..

గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్​ పెండింగ్​లో పెట్టడంతో 2019 నుంచి వర్సిటీ పరిధిలో డిగ్రీ కాలేజీలు మూత పడుతున్నాయి. ఆర్థిక భారం వల్ల కాలేజీలను నడుపుకోలేక ప్రైవేట్​ కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను బంద్​ పెడుతున్నాయి. గడిచిన ఐదేండ్లుగా వర్సిటీ పరిధిలోని గద్వాల, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి ప్రాంతాల్లో 12 కాలేజీలు మూతబడినట్లు సమాచారం. 

కొత్త ప్రభుత్వ కాలేజీలు మంజూరు.. 

20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-24 అకడమిక్​ ఇయర్​ నుంచి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్​ ఆఫ్ హయ్యర్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ వర్సిటీ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. నాగర్​కర్నూల్, నారాయణపేట, పుల్లూరు ప్రాంతాల్లో జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్​ డిగ్రీ కాలేజీలను, మక్తల్, ధన్వాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను, కోస్గిలో ఉమెన్స్​ డిగ్రీ కాలేజీ, ఆమనగల్లు, దేవరకద్ర, మద్దూరులో డిగ్రీ కాలేజీలను మంజూరు చేసి గ్రామీణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి బాటలు వేస్తోంది.

నిరుడు భర్తీ కాని సీట్లు..

గత విద్యా సంవత్సరంలో పాలమూరు వర్సిటీ పరిధిలో ‘దోస్త్’ ద్వారా 36 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. కానీ, అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరగలేదు. కేవలం 40 శాతం రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అందులో దోస్త్​ ద్వారా ఆన్​లైన్​లో 13,311, ఆఫ్​లైన్​ ద్వారా 1,149 స్టూడెంట్లు డిగ్రీ కాలేజీల్లో జాయిన్​ అయ్యారు. అయితే ఈ ఏడాది డిగ్రీ స్టూడెంట్ల సంఖ్య పెరిగే​అవకాశాలున్నాయి. ప్రధానంగా మహబూబ్​నగర్​లోని ఎంవీఎస్, బాయ్స్​ డిగ్రీ కాలేజ్, జడ్చర్లలోని బీఆర్ఆర్​ డిగ్రీ కాలేజ్, కొడంగల్​లోని గవర్నమెంట్​ డిగ్రి కాలేజీల్లో ఈ అకడమిక్​ ఇయర్​ నుంచి స్కిల్​ అండ్​ నాలెడ్జ్​ సెంటర్​ ప్రారంభం కానుంది. దీంతో సీట్లు పెరిగే ఆస్కారం ఉంది.