
మంచిర్యాల, వెలుగు: కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మంచిర్యాలలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో బీజడ్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. మంగళవారం రాత్రి 10.30 గంటలకు స్టడీ అవర్స్ ముగిసిన తర్వాత సిబ్బంది పైఅంతస్తు గేట్లు క్లోజ్ చేశారు. కానీ అప్పటికే బిల్డింగ్ పైన ఉన్న స్వప్న కొద్దిసేపటి తర్వాత బిల్డింగ్ పైనుంచి కిందికి దూకింది.
గమనించిన ప్రిన్సిపాల్, సిబ్బంది స్వప్నను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు అక్కడి నుంచి, హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. స్వప్న కాళ్లు, వెన్నెముక విరిగి తీవ్ర గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఇటీవల ఇదే కాలేజీ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం, ఇప్పుడు స్వప్న ఆత్మహత్యకు యత్నించడంతో స్టూడెంట్లు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.