దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకో చోట ఎన్ఐఏ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇవాళ ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ముగ్గురు సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, బొయినపల్లి అభిషేక్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ మరికొన్ని చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో కూడా ఆరు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంకి అత్యంత సన్నిహితుడైన అమిత్ ఆరోరాలో ఇంట్లో సీబీఐ, ఈడీ సోదాలు చేసింది. సోదాల్లో లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళలోనూ ఈడీ సోదాలను నిర్వహిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అభిషేక్ రావు కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. అభిషేక్ రావు అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత పీఏ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ రావు ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతాడోనంటూ టీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలయ్యింది.