న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ కు కరోనా వైరస్ సోకింది. బుధవారం ఉదయం వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో జైన్ను మంగళవారం రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో నిన్న వైరస్ టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయితే తీవ్ర జ్వరం, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో 24 గంటల తర్వాత మళ్లీ వైరస్ టెస్ట్ చేస్తామని మంగళవారం నాడు అక్కడి డాక్టర్లు తెలిపారు.
బుధవారం ఆయనకు రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆరోగ్య శాఖ మంత్రికి కూడా పాజిటివ్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలోముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు, అతిశి, విశేష్ రవి, రాజ్ కుమార్ ఆనంద్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వైద్యులు జైన్కు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.