భార్యను చంపిన భర్త.. కత్తితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

భార్యను చంపిన భర్త.. కత్తితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. భార్య మీద కసి పెంచుకున్న ఓ భర్త కత్తితో పొడిచి ఆమెను కడతేర్చాడు. ఈ ఘటన మంగోల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగోల్‌పురిలో నివసించే సమీర్, షబానాలు భార్యభర్తలు. వీరికి 21 మరియు 17 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. షబానా ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తుండగా.. సమీర్ ఏ పని చేయకుండా ఆమె సంపాదన మీదే ఆధారపడేవాడు. పైగా సమీర్ తాగుడుకు బానిసగా మారాడు. దాంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గొడవలతో విసుగుచెందిన షబానా.. సమీర్‌ను నెల రోజుల క్రితం ఇంట్లోంచి గెంటేసింది. అప్పటి నుంచి సమీర్ ఇంట్లోకి వెళ్లకుండా.. రోడ్ల మీదే తిరుగుతున్నాడు. ఈ ఘటనతో భార్య మీద కోపం పెంచుకున్న సమీర్.. శనివారం ఉదయం షబానా మీద కత్తితో దాడిచేశాడు. అనంతరం ఆమెను ఇంటి పక్కన ఉన్న షాపులో పడేశాడు. గమనించిన స్థానికులు షబానాను సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. షబానా మీద దాడిచేసిన అనంతరం.. సమీర్ కత్తితో సహా వెళ్లి మంగోల్‌పురి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. షబానా పిల్లల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసిన పోలీసులు.. సమీర్‌ను విచారిస్తున్నారు.