
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో రోజుకొకరికి కరోనా పాజిటివ్ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రం నుంచి ఎంతమంది ఆ మసీదుకు వెళ్లారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నరు. ఇందులో భాగంగా ఓ ట్రావెల్ ఏజెంట్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిజాం కాలంలో నిర్మించిన ఢిల్లీలోని మసీదుకు, ఏటా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో వెళ్తారు. ఈ మసీదుకు వెళ్లొచ్చిన పాతబస్తీ, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఇప్పటికే వైరస్ పాజిటివ్ వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారిన పడ్డారు. శనివారం కరోనాతో మృతి చెందిన వృద్ధుడు అదే మసీదుకు వెళ్లొచ్చినట్టు ఆఫీసర్లు చెబుతున్నరు. శనివారం పాజిటివ్ వచ్చిన 8 మందిలో నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన అదే మసీదుకు వెళ్లి వచ్చినట్టు తెలిసింది. చనిపోయిన వృద్ధుడు ప్రయాణించిన ట్రైన్లోనే నిజామాబాద్ వ్యక్తి కూడా ప్రయాణించినట్టు సమాచారం. నిజామాబాద్ వ్యక్తితో అదే ప్రాంతానికి చెందిన మరో ఐదుగురు కూడా ఢిల్లీ వెళ్లినట్టు గుర్తించిన అధికారులు, వాళ్లను ఐసోలేషన్కు తరలించారు. ఈ 17న వీళ్లంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఢిల్లీలోని ఆ మసీదుకు వెళ్లొచ్చిన వారందరిని ఐసోలేట్ చేయాలని సర్కారు భావిస్తోంది.