వర్షాకాలం మొదలైంది.. వర్షాలు పడినా పడకపోయినా హెల్దీ ఫుడ్ తినాల్సిందే.. అడప దడపా పడిన వర్షానికి వైరస్ లు విజృంభిస్తాయి. అలాంటప్పుడు కచ్చితంగా మనం బ్రేక్ ఫాస్ట్ దగ్గర నుంచి .. లంచ్.. డిన్నర్ లో కూడా ఇమ్యూనిటి పవర్ పెంచే పదార్దాలను తినాల్సిందే.. నోటికి కమ్మగా ఉండే పైనాపిల్ దోశె.. ముల్లంగి పచ్చడి తిన్నారంటే.. రుచితో పాటు మంచి ఇమ్యూనిటి పవర్ కూడా వస్తుంది. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పైనాపిల్ దోశె చాలా రుచికరమైన, తియ్యగా మరియు పుల్లని రుచులతో కూడిన అల్పాహారం. బియ్యం, పైనాపిల్ ముక్కలు, పచ్చి కొబ్బరి మరియు అటుకులను మెత్తగా రుబ్బి, పులియబెట్టి ఈ దోశెలను తయారుచేస్తారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
పైనాపిల్ దోశె తయారీకి కావలసిన పదార్థాలు
- బియ్యం: ఒకటిన్నర కప్పు
- పైనాపిల్ ముక్కలు: ఒకటిన్నర కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
- పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు
- అటుకులు: పావు కప్పు
- మెంతులు: ఒక టీస్పూన్
- ఉప్పు: రుచికి సరిపడా
- నూనె లేదా వెన్న: దోశెలు కాల్చడానికి సరిపడ
పైనాపిల్ దోశె తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యం, మెంతులు, అటుకులు వేసి శుభ్రంగా కడిగి, 3 నుంచి -4 గంటల పాటు నానబెట్టాలి. ఆతరువాత నానబెట్టిన మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. దానితో పాటు పైనాపిల్ ముక్కలు, పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ దోశె పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, తగినంత ఉప్పు కలపాలి. పిండిని 2 నుండి 3 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచి పులియనివ్వాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం వేడి చేయాలి. పెనం మీద కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండిని పోసి మందంగా (దోశెలా) పల్చగా వత్తుకోవాలి.దోశె చుట్టూ కొద్దిగా వెన్న లేదా నూనె వేసి, దోరగా కాలేంత వరకు మీడియం మంటపై రెండు వైపులా కాల్చుకోవాలి.ఈ పైనాపిల్ దోశెలు కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి
ముల్లంగి చట్నీ తయారీకి కావలసినవి
- ముల్లంగి: ఒకటి
- నూనె: పావు కప్పు
- ధనియాలు: ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర: ఒక టీస్పూన్
- పోపుగింజలు (ఆవాలు, జీలకర్ర, మినుప పప్పు, శనగ పప్పు): రెండు టీస్పూన్లు
- ఎండు మిరపకాయలు: పది
- వెల్లుల్లి రెబ్బలు: ఐదు,
- కరివేపాకు: ఒక రెబ్బ
- ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది)
- పసుపు: ఒక టీస్పూన్
- చింతపండు గుజ్జు: ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: తగినంత
ముల్లంగి చట్నీ తయారీ విధానం
ముందుగా ముల్లంగి తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. స్టవ్మీద పాన్పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై వేయించి తీయాలి. అదే పాన్లో మరో టేబుల్ స్పూన్ నూనెవేసి ముల్లంగి ముక్కలను జోడించి సన్నని మంటపై వేయించాలి.
వాసనపోయేలా వేగాక.. అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి దించేయాలి. ముందుగా వేయించుకున్న మిరపకాయల మిశ్రమం, తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు మెత్తగా గ్రైండ్ చేశాక.. ముల్లంగి ముక్కలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దీనికి పోపు పెడితే.. ముల్లంగి పచ్చడి రడీ.. దీనిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.
