
- కొత్తగా ఏర్పాటైన పాలమూరు కార్పొరేషన్, మద్దూరు, దేవరకద్ర మున్సిపాలిటీలు
- నేటి నుంచి ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాల స్వీకరణ
- ఈ నెల 21న ఫైనల్ నోటిఫికేషన్
మహబూబ్నగర్, వెలుగు: కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వార్డుల డీలిమిటేషన్కు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉండడంతో.. వార్డుల డీలిమిటేషన్ను ఈ నెలలో పూర్తి చేసి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ శాఖకు చెందిన ఆఫీసర్లు వార్డుల విభజన, వార్డుల బౌండరీలు, ఓటర్ల వివరాలతో ముసాయిదాను విడుదల చేశారు. దీనిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తీసుకొని ఈ నెల 21న ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇదీ షెడ్యూల్..
4న వార్డుల విభజన ప్రపోజల్స్కు నోటీసు జారీ చేస్తారు. 5 నుంచి 11 వరకు వారం రోజుల పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 12 నుంచి 16 వరకు వచ్చిన అభ్యంతరాలపై ఎంక్వైరీ చేసి పరిష్కరించనున్నారు. 17, 18వ తేదీల్లో కలెక్టర్ అప్రూవల్కు పంపించనున్నారు. ఈ రిపోర్టును 19న కమిషనల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్కు, 20 న రాష్ట్ర ప్రభుత్వానికి పంపి 21న ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
దేవరకద్ర, మద్దూరు మున్సిపాల్టీల్లో ఇలా..
ఈ ఏడాది జనవరి 4న రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ప్రకటించగా.. అందులో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలోని దేవరకద్ర, మద్దూరు గ్రామ పంచాయతీలకు చోటు దక్కింది. ఈ రెండు జీపీలు మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ కాగా.. ఇందులో దేవరకద్ర మున్సిపాల్టీలో దేవరకద్ర గ్రామ పంచాయతీతో పాటు చౌదర్పల్లి, బల్సుపల్లి, పెద్దగోప్లాపూర్, మీనుగోనిపల్లి గ్రామ పంచాయతీలను, మద్దూరు మున్సిపాలిటీలో మద్దూరు గ్రామ పంచాయతీలోని సాపన్చెర్వుతండా, అంబటోనిపల్లి వంపు, భీంపూర్, నాగంపల్లి, రెణివట్ల జీపీలోని వాయిల్కుంటతండా, ఎర్రగుంటతండా, రాళ్లబావి గ్రామాలను విలీనం చేసింది.
అయితే గత సోమవారం ఈ మున్సిపాల్టీల వార్డుల విభజనకు సంబంధించి నోటీస్ జారీ చేశారు. ఇందులో దేవరకద్ర మున్సిపాలిటీలో 10,154 మంది ఓటర్లు ఉండగా.. 12 వార్డులుగా విభజించారు. ఇందులో ఒకటో వార్డులో చౌదర్పల్లి ఉండగా 844 ఓటర్లు, రెండో వార్డులో చౌదర్పల్లిలోని నాలుగు ప్రాంతాలు, దేవరకద్రలోని రెండు ప్రాంతాలను కలుపుతూ 843 మంది, మూడో వార్డులో 868, నాల్గో వార్డులో 866, ఐదో వార్డులో 843, ఆరో వార్డులో 860, ఏడో వార్డులో 833, ఎనిమిదో వార్డులో పెద్దగోప్లాపూర్ పరిధిలోని ఎనిమిది ప్రాంతాలు, దేవకరద్రలోని ఒక ప్రాంతం కలుపుకొని 850 మంది, తొమ్మిదో వార్డులో మీనుగోనిపల్లిలోని ఎనిమిది ప్రాంతాలకు చెందిన 810 మంది, పదో వార్డులో దేవరకద్రకు చెందిన 838 మంది, 11వ వార్డులో దేవరకద్రకు చెందిన 850 మంది, 12వ వార్డులో దేవరకద్రలోని ఒక ప్రాంతంతో పాటు బల్సుపల్లిలోని ఎనిమిది ప్రాంతాలకు చెందిన 849 మంది ఓటర్లను చేర్చారు.
మద్దూరు మున్సిపాల్టీలో 10,967 మంది ఓటర్లు ఉండగా.. 16 వార్డులుగా విభజించారు. ఇందులో ఒకటో వార్డులో 682 మంది ఓటర్లు, రెండో వార్డులో 670 మంది, మూడో వార్డులో 674, నాల్గో వార్డులో 730 మంది, ఐదో వార్డులో 651 మంది, ఆరో వార్డులో 674 మంది, ఏడో వార్డులో 639, ఎనిమిదో వార్డులో 667 మంది, తొమ్మిదో వార్డులో 710 మంది, పదో వార్డులో 730 మంది, 11వ వార్డులో 665, 12, 13వ వార్డుల్లో 670 మంది చొప్పున, 14వ వార్డులో 715, 15వ వార్డులో 750 మంది, 16వ వార్డులో 670 మందితో ముసాయిదా రిలీజ్ చేశారు.
60 డివిజన్లతో పాలమూరు కార్పొరేషన్..
గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. దీని పరిధిలో మహబూబ్నగర్ మున్సిపాలిటీతో పాటు దివిటిపల్లి, జైనపల్లిపూర్ గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. గతంలో పాలమూరు మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా.. దీనిని 60 డివిజన్లుగా విభజన చేయనున్నట్లు తెలిసింది. ప్రతి డివిజన్ పరిధిలోని 3,400 మంది ఓటర్లు ఉండేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీలో 3,36,647 జనాభా ఉండగా.. 1,90,774 మంది ఓటర్లు ఉన్నారు. కాగా.. ఏ డివిజన్పరిధిలో ఏ ప్రాంతాలు ఉంటాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ ప్రాంతాలు ఏ డివిజన్ పరిధిలోకి వస్తున్నాయో తెలియక టెన్షన్ పడుతున్నారు.