
హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హత, అనుభవం లేకుండానే స్కిన్ ట్రీట్మెంట్ చేసేవాళ్ల సంఖ్య తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పెరిపోతున్నదని యాంటీ క్వాకరీ, లీగల్, ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ రజిత అన్నారు. డెర్మటాలజీ స్పెషలిస్టులందరూ కలిసి నాలుగేండ్లుగా అలాంటి వారిపై పోరాటం చేస్తున్నామన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘‘గత నాలుగేండ్లలో రాష్ట్రంలో 85, ఇతర రాష్ట్రాల్లో 312 క్లినిక్లలో అర్హత లేకుండానే చర్మ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సర్వే ద్వారా గుర్తించాం. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశాం. నామమాత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు’’అని ఆరోపించారు.
90 శాతం మంది బీడీఎస్ చేసిన వారే..
చర్మ వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తున్న వారిలో దాదాపు 90 శాతం మంది బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్సర్జన్) చేసిన వాళ్లే ఉన్నారని డాక్టర్ రజిత ఆరోపించారు. ‘‘బీడీఎస్ కోర్సులు చేసి డెర్మాటలజీ స్పెషలిస్టులుగా అవతారం ఎత్తుతున్నారు. అయినప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేయడంతో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాళ్ల కారణంగా మాకు చెడ్డ పేరు వస్తున్నది. డెంటల్ డాక్టర్లతో పాటు కొన్ని చోట్ల బ్యుటీషియన్లు కూడా వారి పరిధి దాటుతున్నరు” అని చెప్పారు.